calender_icon.png 23 October, 2024 | 11:54 PM

రోడ్డు పక్కన గోనె సంచిలో ఆడబిడ్డ

12-09-2024 03:02:40 AM

డోకూర్ గేటు వద్ద వదిలేసిన కఠినాత్ములు 

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): అధునిక ప్రపంచంలోనూ ఆడబిడ్డలను వద్దనుకుంటున్న తల్లిదండ్రులు ఉండటం బాధాకరం. రెండు నెలలు కూడా నిండని ఓ ఆడబిడ్డను వదిలించుకునేందుకు గోనేసంచిలో ఉంచి, రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగింది. జిల్లాలోని డోకూర్ గేటు వద్ద ఉన్న బస్టాండ్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం సమయంలో దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి వాకింగ్‌కు వెళ్లగా చిన్నారి ఏడుపు వినిపించింది.

దగ్గరకు వెళ్లి చూడగా చిన్నారి కనిపించింది. గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్, ఆశ కార్యకర్తకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. చిన్నారి రెండున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చిన్నారిని శిశుగృహానికి తరలించారు.