23-04-2025 01:23:06 AM
సూర్యాపేట, ఏప్రిల్ 22: మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆవాజ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. మంగళ వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మమత బాంకెట్ హాల్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన “వక్స్ సవరణ చట్టం- 2025 రాజ్యాంగ విరుద్ధం “ అనే అంశంపై నిర్వహించిన సెమినార్ కు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్లమెంటు నియమించిన జేపీసీ లో ప్రతిపక్ష సభ్యులు సూచించిన ఒక్క సవరణను ఆమోదించకుండా నియంతృత్వంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.
రాజ్యాంగ పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి, ప్రజాతంత్ర హక్కులు కాలరాస్తూ, చట్టబద్ధ రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని కోరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, వక్స్ బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు జరిగే పోరాటాలలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ మద్దతుగా ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముజఫర్ అత్తర్ సాహెబ్, మమ్మద్ ఖలే ద్ అహ్మద్, ముక్తి మమ్మద్ అసలర్ సాహెబ్ , హమీద్ ఖాన్, మౌలానా నిజాముద్దీన్, ముక్తి హసన్, హఫీస్ హమ్మద్ ఖలీల్ అమ్మద్, ఫక్రుద్దీన్,ముక్తి హమ్మద్ అబ్రార్ సాహెబ్, సిద్ధిక్, షేక్ అబ్దుల్లా పాల్గొన్నారు.