06-03-2025 12:13:24 AM
గద్వాల, మార్చి 05 ( విజయక్రాంతి ) : గద్వాల్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సమగ్ర డేటాను త్వరితగతిన సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశం హాల్లో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి సంబంధిత అధికారులకు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల రూపకల్పనపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా డ్రోన్ సర్వే ద్వారా సమగ్ర సమాచారం సేకరించినట్లు తెలిపారు.నివాస ప్రాంతాలు, పారిశ్రామిక వృద్ధి, వాణిజ్య అభివృద్ధి జరగబోయే ప్రాంతాలను గుర్తించడం జరిగేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ ప్లానింగ్, ఆరోగ్య,నీటి వనరుల నిర్వహణ, పరిశ్రమల స్థాపన తదితర అంశాలకు సంబంధించిన సమాచారం సంబంధిత శాఖల నుండి సేకరించనున్నట్లు తెలిపారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రస్తుత అభివృద్ధి ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాను సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్ కు సంబంధించి వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు అందించాల్సిన సమాచారం, ఆయా శాఖల బాధ్యతలు, అనుకరించాల్సిన విధులు, ముఖ్య అంశాలను వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,గద్వాల్ మున్సిపల్ కమిషనర్ దశరథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.