calender_icon.png 21 October, 2024 | 3:59 AM

ఈపీఎఫ్‌వోలో 18.53 లక్షల సభ్యుల జత

21-10-2024 01:40:22 AM

ముంబై, అక్టోబర్ 20: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో ఈ ఏడాది ఆగస్టు నెలలో  నికరంగా 18.53 లక్షల మంది సభ్యులు జతయ్యారు. గతంలో ఈపీఎఫ్‌ఓ నుంచి వైదొలిగి తిరిగి చేరినవారు కూడా వీరిలో ఉన్నారు. ఆదివారం కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన పేరోల్ డాటా ప్రకారం గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో చేరికలు 9 శాతం పెరిగాయి.   కొత్త సభ్యుల్లో 2.53 లక్షల మంది మహిళలు ఉన్నారు.

2023 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా చేరిన మహిళలు 3.75  శాతం మంది పెరిగారు. పాత మహిళా సభ్యులతో కలుపుకుంటే 3.79 లక్షల మంది నికరంగా చేరారు.  దేశంలో ఉపాధి అవకాశాలు పెరగడం, ఉద్యోగులకు లభించే ప్రయోజనాల పట్ల అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో కార్యక్రమాల సమర్థత సభ్యత్వ పెంపునకు దోహదపడినట్టు కార్మిక శాఖ తెలిపింది. కొత్తగా చేరిన సభ్యుల్లో 18 వయస్సుగలవారు 59.26 శాతం ఉన్నారన్నారు. ఆగస్టులో ఈ వయస్సు ఉన్నవారు 8.06 లక్షల మంది చేరారు. కొత్త చేరికలు మహారాష్ట్రలో అధికంగా 20.59 శాతం పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ వృద్ధి 5 శాతం మేర ఉన్నది.