13-02-2025 02:02:25 AM
కామారెడ్డి ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): దోమకొండ మండలంలో రైతు భరోసా కు ఎంపికైన రైతులు 8541 మంది అర్హులని మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. బుధవారం దోమకొండలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు అర్హులైన రైతులకు పథకాల గురించి వివరించడం జరుగుతుందన్నారు.
8,541 మంది రైతులకు సంబంధించి 6,909 ఎకరాలకు 8 కోట్ల 29 లక్షల 11329 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయబడుతుందని అన్నారు. ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు వారి ఖాతాలలో రైతు భరోసా జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మిగతా రైతులందరికీ త్వరలోనే రైతు భరోసాను జమ చేస్తుందని వివరించారు.
వ్యవసాయ శాఖ అధికారులచే ప్రభుత్వం ఎంపిక చేసిన భూములు అన్నింటికీ రైతు భరోసాను అందజేయడం జరుగుతుందని రైతులు ఎవరు కూడా దిగులు చెంద వద్దన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ కదిరె గోపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి స్వామి, పట్టణ అధ్యక్షుడు సీతారాం, మధు, సంగమేశ్వర్ గ్రామ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డైరీ అధ్యక్షుడు మందుగుల నరేష్, నేతుల సుధాకర్, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.