19-03-2025 01:46:09 AM
దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు
ఈనెల 31లోపు 25 శాతం రాయితీ
జిల్లాలో 22,000 దరఖాస్తులు
ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
రామాయంపేట, మార్చి 18: అనధికార లే అవుట్ ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్ధీకరించడానికి 2020 సంవత్సరంలో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఈనెల 31లోగా క్రమ బద్దీకరించి రుసుము చెల్లించిన వారికి 25 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా 22వేల దరఖాస్తులను క్రమబద్దీకరించేందుకు దరఖాస్తుదారులకు అధికారులు ఫోన్లు చేసి మరీ అలర్ట్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే అన్ని మండలాల ఎంపీడీవోలు ఎల్ఆర్ఎస్పు ఫోన్లు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సంబంధిత సబ్ రిజిష్టర్ కార్యాలయంలో ఈ సేవలను పొందవచ్చని చెబుతున్నారు.
రాయితీని సద్వినియోగం చేసుకోండి :కలెక్టర్ రాహుల్ రాజ్
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31లోగా చెల్లించేవారికి 25 శాతం రాయితీ ప్రభుత్వం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న క్రమబద్దీకరణ ప్రక్రియను పరిశీలించారు. రుసుము చెల్లించిన వెంటనే రాయితీతో పాటు సంబంధిత ప్రొసీడింగ్ లు జారీ చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన దరఖాస్తుదారులు సైతం రుసుము చెల్లించి తమ ప్లాట్ల క్రమబద్దీకరణ చేసుకోవాలని కోరారు. నిషేధిత భూముల విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.