లోక కల్యాణం సీతారాముల పరిణయం
18-04-2024
మంగళ వాద్యాల ప్రతిధ్వనులు.. వేద పండితుల పెండ్లి మంత్రాలు.. ‘శ్రీరామా.. జయ రామా.. జయ జయ రామా ..’ అన్న భక్తుల నామస్మరణ నడుమ ఎప్పుడెప్పుడా.. అని ఎదరు చూస్తున్న క్షణాలు రానే వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ ఘడియల్లో అర్చకులు సీతారాములపై జీలకర్ర, బెల్లం ఉంచారు. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు తాళిబొట్లు చూపిస్తూ సీతమ్మకు మంగళ సూత్రాలధారణ చేశారు. ఈ అపురూపమైన వేడుకకు భద్రగిరిలోని మిథిలా ప్రాంగణం వేదికైంది. కల్యాణ మహోత్సవాన్ని చూసి భక్తకోటి తరించింది. పవిత్ర గోదావరి తీరం పులకించింది. ఆలయ అధికారులు, అర్చకులు ఉదయం 10 గంటలకు ప్రధాన ఆలయం నుంచి మేళతాళాల నడుమ కల్యాణమూర్తులను సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలోని మిథిలా ప్రాంగణంలోని మండపంలోకి తీసుకువచ్చారు. రామయ్యకు అభిముఖంగా సీతమ్మను పెళ్లి పీటలపై ఆశీనులను గావించారు. వేదపండితులు విశ్వక్సేన పూజ, ప్రవరణ, మోక్షబంధనం, యజ్ఞోపవీతం, వర పూజ నిర్వహించారు. మధుపర్కాలు సమర్పించారు. వాగ్గేయకారుడు భక్తరామదాసు చేయించిన పచ్చల పతకాన్ని రామయ్యకు, చింతాకు పతకాన్ని సీతమ్మకు, శ్రీరామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. సీతమ్మకు మాంగళ్యధారణ తర్వాత వధూవరులకు ఆండాళమ్మ, శ్రీరంగనాథుని ప్రబోధంతో వైష్ణవ సంప్రదాయం ప్రకారం బంతులాట సంబురం నిర్వహించారు. ముత్యాల తలంబ్రాల పోత తర్వాత సీతారాములకు అష్టోత్తర హారతి ఇచ్చి కల్యాణ వేడుకను ముగించారు. ఆలయ ఆస్థానాచార్యులు శ్రీమాన్ స్థల సాయి కల్యాణ ప్రాశస్త్యాన్ని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు పట్టువస్త్రాలను బహూకరించారు. వేడుకలోని వీఐపీ గ్యాలరీలో కూర్చొని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.