శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం
సిద్దిపేట, ఏప్రిల్17(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు బుధవారం గ్రామగ్రామాన ఘనంగా జరిగాయి. హుస్నాబాద్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాల వద్ద జరిగిన శ్రీరామనవమి కల్యాణోత్సవాల్లో రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం సీతారాములను దర్శించుకుని పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పలు ప్రాంతాల్లో శ్రీరాముని శ్లోకాలు పఠిస్తూ ప్రజలతో చదివిపించడం అందరినీ ఆకర్శించింది.
శ్రీరాముడి బాటలో ప్రజలంతా నడవాలి:
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి
ఒకేమాట, ఒకేబాణం అన్న ధర్మమూర్తి శ్రీరాముడి బాటలోనే ప్రజలంతా నడవాలని, ధర్మాన్ని ఆచరించాలని బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అన్నా రు. బుధవారం గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. దుబ్బాక మండలం పోతారంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కుటుంబసమేతంగా సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.